మంత్ర శాస్త్రము :



ఒక ఊర్లో ఒక శాస్త్రి గారు వుండేవారు ఆయన పరమ నిష్ఠా
గరిష్టుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న
శివ పంచాయతనం వుండేది. శాస్త్రి గారు రోజూ నమక
చమకములతో అభిషేకము చేసి శ్రద్దగా పూజ
చేస్తూ వుండేవారు.
ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి, వాళ్ళ
పాలేరు కు నాలుగు పెట్టినది. వాడు కమ్మగా తిని, అమ్మా
ఇంక నాలుగు వడలు పెట్టు అమ్మా అన్నాడు. ఇంటి
ఆవిడ “లేవురా అయిపోయినాయి” అన్నది.
అదేంటి అమ్మగారు ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకొని
లేవు అంటారు అని అన్నాడు.
ఆవిడ వంటింట్లోకి వెళ్లి లెక్క పెడితే సరిగ్గా 23
గారెలు వున్నాయి. నీకెలా తెలుసురా అని అడిగినది.
తెలుసులెండి అని వాడు అన్నాడు. ఈ విషయాన్ని తన భర్త
కు తెలిపినది ఆ మహా ఇల్లాలు. శాస్త్రి
గారు పాలేరును నిలదీసినాడు ..నీకు ఎలా
తెలుసు అని. తెలుసు లెండి
గురువు గారు అన్నాడు. వదల లేదు శాస్త్రి గారు.
అదొక విద్య లెండి నాకు మా అయ్య నుంచి వచ్చినది,
నాకు ఒక యక్షిణి చెవులో చెబుతుంది ఇదంతా
అన్నాడు.
ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర పట్టలేదు. ప్రక్క
రోజు పాలేరును అడిగాడు. ఒరేయ్ ఇన్ని రోజుల
నుంచి నేను పూజ చేస్తున్నాను, నాకు ఏ విద్య
రాలేదు, ఏ శక్తి రాలేదు, నీకు ఈ విద్య ఎలా వచ్చినది? ఆ
మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు.
విధి లేక పాలేరు ఆ మంత్రాన్ని (కర్ణ పిశాచి)
మంత్రమును గురువు గారికి చెప్పినాడు. ప్రక్క
రోజు గురువు గారు శ్రద్దగా ఆ మంత్రాన్ని
పఠించినాడు. కర్ణ పిశాచి ఇంటి బయట నుంచి పలికినది.
శాస్త్రి గారూ అని పిలిచినది. ఏమి కావాలి అని అడిగినది.
గురువు గారు ఇంట్లో నుంచి ఎవరూ అని
అడిగినాడు. నేను కర్ణ పిశాచిని (యక్షిణి) మీ ఇంట్లోకి
రావాలంటే ఆ పూజా మందిరములోని దేవతా
మూర్తులను బయట పడెయ్యండి, నేను లోపలి
వస్తాను అని అన్నది.
శాస్త్రి గారి గుండె గుభేలు మన్నది.
అప్పుడు అర్ధమైనది. ఒరేయ్ మా ఇంట్లో పూజా
మందిరములోని దేవతా మూర్తులు ఎంత శక్తి
వంతమైనవో, వాటి వలనే గదా ఈ పిశాచము లోనికి రాలేదు. ఇలా
ఎన్ని రోజుల నుంచి నన్ను నా కుటుంబాన్ని
దుష్ట శక్తుల నుంచి కాపాడు తున్నాయో గదా,
ఇన్నాళ్ళు నాకు తెలియ లేదు, పెద్దలు ఇచ్చిన నిజమైన
ఆస్తి ఇదే కదా అని, నీవూ వద్దు, నీ
మంత్రము వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్లి పొమ్మన్నాడు. తన
పూజా మందిరములోకి వెళ్లి ఆ పరమ శివుని కాళ్ళ మీద పడి
కృతజ్ఞతతో “ ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే
రుద్రాయ నమః” అని చెంపలు వేసుకొన్నాడు. మంత్ర
విద్య వున్నది నమ్మకము శ్రద్ధ అవసరము దేనికైనా.
పూజా మందిరములో వున్న విగ్రహాలు పాతవైనా, అరిగి
పోయినా మీ తాత ముత్తాతలు పూజించినవి అవి. వాటిల్లో ఎంతో
శక్తి దాగి వుంటుంది. వాటిల్ని పారేయకండి. భక్తితో ఒక్క
పుష్పం పెట్టండి. అవి చైతన్య మౌతాయి. మిమ్మల్ని మీ
కుటుంబాన్ని కాపాడుతాయి.

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩