🚩🚩వరవిక్రయం (నాటకం)


 🚩🚩వరవిక్రయం (నాటకం)

✍సంఘ సంస్కర్త, ప్రఖ్యాత నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ రచించిన నాటకం వరవిక్రయం

✍ కాళ్లకూరి వారి సృష్టి సింగరాజు లింగరాజు అనే లుబ్ధుని పాత్ర అజరామరం. ఇప్పటికీ ఎవరైనా పరమలోభి కనబడితే వాడిని సింగరాజు లింగరాజు అనడం కద్దు.

♦వరకట్న దురాచారాన్ని ఖండించే శుభలేఖ చిత్రం ముగింపు వరవిక్రయము ముగింపును పోలి ఉండడం గమనార్హం.

జంధ్యాల రూపొందించిన అహ! నా పెళ్ళంట ! సినిమాలో లక్ష్మీపతి పాత్రకు, దేవదాసు కనకాల దర్శకత్వంలో ఓ ఇంటి భాగోతం సినిమాలో నూతన్ ప్రసాద్ పాత్రలు చూస్తే సింగరాజు లింగ రాజు జ్ఞాపకం వస్తాడు.

అల్లు రామలింగయ్య చాలా సినిమాలలో పోషించిన పాత్రలకు వెంగళప్ప పాత్రకు బాగా పోలికలు ఉంటాయి.

ఎన్నిసార్లు చదివినా మరలా మరలా చదవాలినిపించాలనే నాటకం వరవిక్రయం

♦"వర విక్రయం" నాటకంలో లింగరాజు గారు కట్నం తీసుకుని

రశీదు రాసిచ్చిన వైనం చూడండి ....

✍"

బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి

సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు.

మీకొమార్తె చి॥ సౌ॥ కాళిందిని, నాకొమారుడు చి॥ బసవరాజునకు చేసికొనుటకు, అందులకై మీరు మాకు కట్నం

క్రింద ఐదువేలు యైదువందల రూపాయల రొక్కము,

రవ్వల ఉంగరము, వెండిచెంబులు, వెండికంచము,

వెండిపావుకోళ్ళు, పట్టుతాబితాలు, వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యధావిధిగా ఇచ్చుటకున్నూ,

ప్రతిపూఁటఁ పెండ్లివారిని బ్యాండుతో పిలుచుటకున్నూ,

రాకపోకలకు బండ్లు, రాత్రులు దివిటీలు నేర్పాటు చేయుటకున్నూ, రెండుసారులు పిండివంటలతో భోజనములు,

మూడుసారులు కాఫీ, సోడా, ఉప్మా, యిడ్డెన, దోసె, రవ్వలడ్డు, కాజా, మైసూరు .... మైసూరు పాకాలతో ఫలహారములు చొప్పున మా యిష్టానుసారము ఐదు దినములు మమ్ము గౌరవించుటకున్నూ, అంపకాలనాడు మాకు పట్టుబట్టలు, మాతో వచ్చువారికి

ఉప్పాడ బట్టలు ఇచ్చుటకున్నూ నిర్ణయించుకొని బజానా

క్రింద పదిరూపాయలు ఇచ్చినారు గాన ముట్టినవి

.... అయ్యా .... ఇట్లు ....

సింగరాజు లింగరాజు వ్రాలు" ....

చాలునా?

పేర:- చాలు బాబూ! చాలు!

మచ్చుకోసం దాచిపెట్టుకోవలసిన మతలబు!

పెండ్లి సమయంలో వియ్యపురాలికి చేయవలసిన మర్యాదల

గురించి కాళ్ళకూరి నారాయణ రావు గారి చమత్కారం చూద్దాం.

"వియ్యపురాలు గారికి తెలివిరాగానే కళ్ళు తుడవాలి;

కాళ్ళు మడవాలి; కోక సర్దాలి; కిందకు దింపాలి; పెరట్లోకి పంపాలి; నీళ్ళచెంబందివ్వాలి; రాగానే కాళ్ళు కడగాలి; పండ్లు తోమాలి;

మొహం తొలవాలి; నీళ్ళు పోయాలి; వళ్ళు తుడవాలి;

తల దువ్వాలి; కొత్తచీర కట్టాలి; కుర్చీ వెయ్యాలి; కూర్చోబెట్టాలి; పారాణి రాయాలి; గంధం పుయ్యాలి; అత్తర్లివ్వాలి; పన్నీరు చల్లాలి; మొహాన్ని మొహరీలద్దాలి! కళ్ళకు కాసులద్దాలి! వంటిని వరహాలద్దాలి; వెండి పలుపు వెనకను కట్టాలి; బంగారుపలుపు పక్కను చుట్టాలి;

దిష్టి తియ్యాలి; హార తివ్వాలి; అధ్వాన్న మివ్వాలి;

నా పిండాకూడివ్వాలి ....యిల్లాంటివింకా నా తలవెంట్రుక లన్ని వున్నాయి. ఆలస్యమైతే అలక కట్నం చెల్లించ వలసి వస్తుంది".

మొగ పెళ్లి వారికి చేయ వలసిన మర్యాదల్లో లోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి ....

"నిన్నటి వుప్మాలో నిమ్మపళ్లరసమే లేదట.

ఇడ్డెన్లలో అల్లం ముక్కలు లేవట. కాఫీలో పంచదార లేదట.

ఈ పూటయినా కాస్త యింపుగా వుండకపోతే పట్టుకు వచ్చిన వాళ్ళ మొహాన్ని పెట్టికొట్టాలని పదిమందీ ఆలోచిస్తూన్నారు

. ఖారాఖిల్లీలు కాస్త యెక్కువగా పంపండి.

చుట్టలూ, సిగరెట్లూ, బీడీలూ కూడా కాస్త శుభ్రమైనవి చూడండి.

నిన్న పంపిన చీట్లపేకలు నిన్ననే చిరిగిపోయాయి.

ఈపూటింకో నాలు గెక్కువ పంపండి.

మదరాసు నశ్యం మాట మరిచిపోకండి. శలవు.

మఱి ఆలస్యమైతే మాటదక్కదు".

పెళ్ళైన తరువాత పదహారు రోజుల పండుగ అంటే ఏమిటో

చూద్దాం.

"తొలినాడు హడావడి, మలినాడు ఆయాసం; మూడు మంగళాష్టకాలు; నాలుగు సిగపట్ల గోత్రాలు; అయిదు అప్పగింతలు;

ఆరు అంపకాలు; ఏడు వంట బ్రాహ్మల తగువు;

ఎనిమిది ఋణదాత నోటీసు; తొమ్మిది జవాబు;

పది దావా; పదకొండు స్టేటుమెంటు; పన్నెండు విచారణ;

పదమూడు డిక్రీ; పద్ధానుగు టమటమా;

పదిహేను వేలం; పదహారు చిప్ప.

ఈ రోజుల్లో యిదే పదహారు రోజుల పండుగ".

♦కాళ్ళకూరి నారాయణ రావు గారు 28 -04 -1871 న తణుకులో జన్మించిన ఆయన అధ్యాపక వృత్తిలో ఉన్నా కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, సంఘ సంస్కరణాభిలాషియై "వర విక్రయం", "చింతామణి", "పద్మవ్యూహం" వగైరా నాటకాలు నవలలు రాశారు.

చింతామణి నాటకంలో కల క్రమేణా అనేక మార్పులు చోటు చేసుకుని వెర్రి తలలు వేసినా అసలు నాటకంలో చింతామణి వేశ్యా వృత్తిలో ఉన్నా "కన్యాశుల్కం" నాటకంలో మధురవాణి లాగా సంఘ సంస్కరణ పై అభిలాష కలిగినది.

♦పై మూడు కాక "మధు సేవ" (సారాయి వలన కలిగే దుష్పరిణామాలపై రచన) అనే నాటకం,"చిత్రాభ్యుదయం" అనే నవలలు కూడా రాశారు. వీటిలో సినిమా రూపంలో వచ్చినవి వర విక్రయం, చింతామణి .... రెండు కూడా సూపర్ హిట్టే .... వీరి ఇతర రచనలు ....

సంసార నటన (1974 "కళ"లో ధారవాహికగా ప్రచురితం), కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు రచించారు. (వికీ)

♦కాళ్ళకూరి నారాయణ రావు గారు 27 -06 -1927 న రాజమండ్రి దగ్గర సిద్ధాంతం అనే గ్రామం లో కాలం చేశారు.

♦తెలుగు వారు గర్వించదగ్గ రచయితల్లో నారాయణరావు గారొకరు. కానీ గురజాడ వారికొచ్చిన పేరు వీరికి రాలేదేమోననిపిస్తుంది.ఇది చదివితే అప్పటి పెళ్లిళ్ల సరళి గుర్తొస్తుంది కదా!

✍సేకరణ:-వింజమూరి .

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩